BR Naidu: శ్రీనివాస సేవా సమితి అక్రమాలపై విచారణ...! 22 d ago

AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. సుపథం టికెట్ ఇచ్చి ఉద్యోగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బోర్డు తీర్మానాలను వివరించారు.
బోర్డు చేసిన తీర్మానాలు ఇవీ.. ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీటీడీకు చెందిన భూములు న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం వ్యక్తం చేసారు. వచ్చే ఏడాది కాలంలో గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడతాం అని సూచించారు.
శ్రీనివాస సేవా సమితి పేరుతో స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం జారీ చేసారు. టీటీడీలో మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం ఆమోదించారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో తిరుమలలో అనధికార హాకర్లును తొలగించుటకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు అందించాలని తెలిపారు. ప్రయోగాత్మకంగా పూర్వ విధానాన్ని అమలు చేయాలని ప్రకటించారు. టీటీడీ 2025-26 బడ్జెట్ కు రూ.5,258.68 కోట్లను ఆమోదించారు. రూ.772 కోట్లను గదుల ఆధునికీకరణకు వినియోగించాలని నిర్ణయించారు.